న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధిలో భారత్కు చెందిన రెండు ట్యాంకర్లపై దాడి తర్వాత ఇరాన్ను భారత్ హెచ్చరించింది. ఇలాంటి సంఘటనల వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. (India warns Iran) శనివారం హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకాదళం కాల్పులు జరిపిన రెండు భారతీయ ముడి చమురు నౌకల్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఆదివారం ధృవీకరించారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో నౌకల్లోని క్యాబిన్ అద్దాలు పగిలినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని భారత అధికారులు టెహ్రాన్కు స్పష్టం చేశారు. భారతీయ నౌకలు, నావికుల భద్రతను నిర్ధారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అక్కడి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు.
కాగా, ఢిల్లీలోని ఇరాన్ రాయబారిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం పిలిపించింది. హోర్ముజ్ జలసంధిలో భారత్కు చెందిన రెండు ట్యాంకర్లపై ఇరాన్ దళాలు కాల్పులు జరుపడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే భారత్కు వచ్చే నౌకలకు సురక్షిత ప్రయాణాన్ని త్వరగా పునఃప్రారంభించాలని ఇరాన్ రాయబారిని కోరింది. భారత్ ఆందోళనలను తమ దేశానికి తెలియజేస్తానని ఇరాన్ రాయబారి హామీ ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు భారత నౌకలపై కాల్పుల సంఘటనను ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తేలికగా తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు తెలియవని ఏఎన్ఐకు చెప్పారు. ‘ఇరాన్, భారత్ మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. మీరు ప్రస్తావించిన ఈ సంఘటన గురించి నాకు ఏమీ తెలియదు. అంతా సర్దుకుంటుందని, ఈ సమస్య పరిష్కారమవుతుందని మేం ఆశిస్తున్నాం’ అని ఇలాహి అన్నారు.
Also Read:
Strait of Hormuz | హర్మూజ్ ద్వారా ఏ ఒక్క నౌక కూడా కదలొద్దు..ఐఆర్జీసీ వార్నింగ్