న్యూఢిల్లీ: భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేయనున్నది. (India suspend postal services to US) ఈ మేరకు తపాలా శాఖ శనివారం ప్రకటించింది. అమెరికా సుంకాలకు సంబంధించిన మార్పులు ఈ నెల చివరి నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 25 నుంచి ఆ దేశానికి పోస్టల్ కన్సైన్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ శనివారం వెల్లడించింది.
కాగా, అమెరికా విధించిన టారిఫ్ డ్యూటీ కలెక్షన్ ప్రక్రియపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆగస్ట్ 25 తర్వాత అమెరికాకు పోస్టల్ పార్శిల్స్ను తీసుకెళ్లబోమని పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా ఆగస్ట్ 25 నుంచి వంద డాలర్లు వరకు విలువైన లేఖలు, పత్రాలు, బహుమతి వస్తువులు మినహా మిగతా అన్ని రకాల వస్తువుల బుకింగ్స్ను నిలిపివేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది.
మరోవైపు ఇప్పటికే పార్శిల్లను బుక్ చేసుకున్న, పంపలేని కస్టమర్లు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చని పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ‘కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి తపాలా శాఖ తీవ్రంగా చింతిస్తోంది, వీలైనంత త్వరగా అమెరికాకు పూర్తి సేవలను తిరిగి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Also Read: