న్యూఢిల్లీ: జపాన్ ఇటీవల సంభవించిన భూకంప విషాదాన్ని మిగిల్చింది. ఈ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. భూకంపం గురించి తెలియగానే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆ లేఖలో తెలియజేశారు.
‘భూకంపంలో అయిన వాళ్లను కోల్పోయి దుఃఖంతో ఉన్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ప్రకృతి విపత్తుతో తీవ్రంగా ప్రభావితమైన జపాన్ దేశానికి, ప్రజలకు నా సంఘీభావం ప్రకటిస్తున్నా. వ్యూహాత్మక, ప్రాపంచిక భాగస్వామిగా జపాన్తో బంధానికి భారత్ విలువనిస్తున్నది. ప్రస్తుతం తరుణంలో జపాన్కు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నది’ అని కిషిడాకు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నారు.
కాగా, 2024 జనవరి 1న (గత సోమవారం) సెంట్రల్ జపాన్లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే 21 సార్లు భూమి కంపించింది. ఈ ఘటనలో ఇప్పటికే 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గల్లంతయ్యారు. ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.