న్యూఢిల్లీ, జనవరి 22: మ్యారిటల్ రేప్ (భార్యకు ఇష్టంలేని శృంగారం)పై ప్రస్తుతం దేశంలో విస్తృత చర్చ నడుస్తున్నది. ‘పెండ్లి అయినంత మాత్రాన మహిళకు హక్కులు అడుగంటుతాయా? భర్తకు నో చెప్పే అధికారం భార్యకు ఉంటుంది’ అని ఇటీవలే ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే కొందరు అత్యుత్సాహులు మాత్రం మ్యారిటల్ రేప్ను నేరంగా పరిగణించొద్దంటూ ఆన్లైన్లో ప్రచారానికి తెరతీశారు. భార్యకు ఇష్టంలేని శృంగారాన్ని నేరంగా పరిగణిస్తే భర్తల మీదకు అనవసరమైన కేసులు వచ్చిపడతాయని వాదిస్తున్నారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ ఈ తరహా ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నది. మ్యారేజ్ స్ట్రైక్, మ్యారిటల్ స్ట్రైక్ హ్యాష్ట్యాగ్లతో ప్రచారం చేస్తున్నారు. భర్తల హక్కుల కార్యకర్తలుగా చెప్పుకొనేవారు ఈ తరహా ప్రచారం జరుపుతున్నారు. మ్యారిటల్ రేప్ను నేరంగా పరిగణించని పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, చైనా తదితర 30 దేశాల్లో భారత్ కూడా ఉంది. భారతీయ లైంగికదాడి చట్టం భార్యాభర్తల మధ్య లైంగిక చర్యలను మినహాయింపు ఇచ్చింది. ఇది వలసవాద పాలన రోజుల నుంచీ ఉంది. కాలం చెల్లిపోయిన, అన్యాయమైన ఈ మినహాయింపును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు విచారిస్తున్నది. భార్యలపై భౌతికంగా దాడి చేశారని, హత్య చేశారని భర్తలపై నేరారోపణలు చేయవచ్చు. కానీ లైంగికదాడికి మాత్రం మినహాయింపు ఉంది. భారతదేశంలోనూ, విశ్వవ్యాప్తంగానూ శతాబ్ది కాలంగా పరిణామం చెందుతున్న వివాహితల హక్కులకు ఇది అనుగుణంగా లేదు. కొత్త నేరాన్ని చేర్చాలంటే పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంటుంది. అది పెద్ద తతంగం. అందుకు బదులుగా మినహాయింపును కోర్టు రద్దు చేస్తే సరిపోతుందని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. మినహాయింపును అలాగే కొనసాగనిస్తే అది ఈ తరం యువతులకు దారుణమైన సందేశాన్నిస్తుందని అంటున్నారు. పెండ్లయితే ఇక మహిళ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదనే అర్థం వస్తుంది. వైవాహిక లైంగికదాడిని నేరంగా చేస్తే అది భారతీయ కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తుందని వ్యతిరేకులు అంటున్నారు. తద్వారా భారతీయ వివాహ వ్యవస్థ డొల్లతనాన్ని వారు ఎత్తిచూపుతున్నారని మహిళావాదులు పేర్కొంటున్నారు.