India | పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ (Pak army chief) సయ్యద్ అసిం మునీర్ (Asim Munir).. భారత్కు అణు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే.. తమతోపాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునీర్ వ్యాఖ్యలపై భారత్ (India) తీవ్రంగా స్పందించింది. మునీర్ అణు బెదిరింపులను తీవ్రంగా ఖండించింది. అమెరికా నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొంది.
ఇలాంటి అణు బెదిరింపులకు భారత్ భయపడదని తెలిపింది. దేశ భద్రత కోసం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్పై విరుచుకుపడుతూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పాక్కు అలవాటేనని దుయ్యబట్టింది. అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు పాక్కు అలవాటేనని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీన్నిబట్టే స్పష్టమవుతోందని పేర్కొంది. పాక్ సైన్యం.. తీవ్రవాద గ్రూపులతో చేతులు కలిపిందని విదేశాంగ శాఖ తన ప్రకనటలో వ్యాఖ్యానించింది.
భారత్పై నోరుపారేసుకున్న పాక్ ఆర్మీ చీఫ్
అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సింధునది వివాదాన్ని ప్రస్తావిస్తూ.. భారత్పై నోరుపారేసుకున్నారు. సింధు నది భారతీయుల ఆస్తిఏమీ కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ నదిపై భారత్ డ్యామ్లు నిర్మించే వరకు ఎదురు చూస్తామని చెప్పారు. తమ వద్ద క్షిపణులకు ఎలాంటి కొదవ లేదని, ఆ డ్యామ్లను పది క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరించారు. భారత్ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఏర్పడితే, తాము నాశనం అవుతూనే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Also Read..
Journalists Killed | ప్రెస్ టెంట్పై ఇజ్రాయెల్ దాడులు.. ఐదుగురు ఆల్ జజీరా జర్నలిస్ట్లు మృతి
Turkey Earthquake | టర్కీలో భూకంపం.. 16 భవనాలు నేలమట్టం.. వీడియోలు