అమరావతి : కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ( MLA Virupakshi ) ని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( YS Jagan Mohan reddy ) గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా విరూపాక్షికి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుందో ఎమ్మెల్యే అరెస్టు ఒక నిదర్శనమని ఆరోపించారు. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ అన్యాయంగా జైలుకు పంపుతున్నారని విమర్శించారు.
కూటమి పాలనలో బాధితులనే పోలీసులు అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పోలీసులు దొంగల మాదిరి ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఎమ్మెల్యేను తీసుకెళ్లిపోయారని విమర్శించారు. గాంధీజీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతుందో రెడ్బుక్ పాలనను చూస్తే అర్ధమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేపై గంటల వ్యవధిలో మూడు కేసులు బనాయించారని ఆరోపించారు.
కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగు తున్న అరాచక పాలనపై ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలని, ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో ఆలోచించాలని కోరారు.చంద్రబాబు శాడిస్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరు కూడా ఎల్లకాలం పదవిలో ఉండరని, మరో మూడు సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయని, తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇవే పరిస్థితులు మీరు ఎదుర్కొంటారని హెచ్చరించారు.