న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని నిర్దేశించే ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చెందిన అత్యంత కీలకమైన కమిటీలో భారత్ సభ్య దేశంగా ఎన్నికైంది. రోమ్లోని ఐరాస ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘సీఏసీ’ 46వ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆసియా ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించే సభ్య దేశంగా భారత్ ఏకగ్రీవంగా ఎంపికైంది.
ఐరాస ఎగ్జిక్యూటివ్ కమిటీలో ముఖ్య విభాగమైన ‘సీఏసీ’ (కోడెక్స్ అలిమాంటేరియస్ కమిషన్)లో సభ్య దేశంగా ఎన్నికయ్యేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతాయి. వివిధ రకాల ఆహార ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాల్ని నిర్దేశించటంలో, నిర్ణయాత్మక ప్రక్రియలో సభ్య దేశంగా భారత్ కీలక ప్రాత పోషిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.