బీజింగ్: ఇండియా, చైనా బోర్డర్ వద్ద ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్(Qin Gang) తెలిపారు. అయితే బోర్డర్ వద్ద ఉన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గేందుకు ఇరు దేశాలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ఇరు దేశాలు ఐక్యంగా వ్యవహరించాలన్నారు. ఎస్సీవో మీటింగ్ కోసం గోవాకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి క్విన్.. గురువారం రోజున విదేశాంగ మంత్రి జైశంకర్తో మాట్లాడారు. గత మూడేళ్ల నుంచి తూర్పు లడాక్లో ఉన్న సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకున్నది.
#WATCH | EAM Dr S Jaishankar welcomes Chinese Foreign Minister Qin Gang for the Meeting of the SCO Council of Foreign Ministers in Goa pic.twitter.com/mOfx8dRlat
— ANI (@ANI) May 5, 2023
ఇరు దేశాలకు చెందిన నేతలు కుదుర్చుకున్న ఏకాభిప్రాయాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సరిహద్దులో ఉన్న పరిస్థితుల్ని చల్లార్చేందుకు, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కచ్చితంగా రూల్స్ పాటించాలని, గత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని క్విన్ వెల్లడించారు. జైశంకర్తో జరిగిన చర్చలకు సంబంధించిన విషయాలను క్విన్ తన పత్రికా ప్రకటనలో రిలీజ్ చేశారు. భేటీ తర్వాత జైశంకర్ తన ట్విట్టర్లో కొన్ని విషయాలు వెల్లడించారు. అసాధారణ సమస్యల్ని పరిష్కరించేందుకు తాము ఫోకస్ పెట్టామని, సరిహద్దుల్లో శాంతి స్థాపనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
క్విన్, జైశంకర్లు భేటీ కావడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. మార్చిలో జరిగిన జీ20 సమావేశాలకు కూడా క్విన్ హాజరయ్యారు. రెండు దేశాలు చరిత్రను పరిశీలించి, ద్వైపాక్షిక ఒప్పందాలను గుర్తించి, వ్యూహాత్మక రీతిలో ముందుకు సాగాలని క్విన్ తెలిపారు.