Tamil Nadu: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై దీపం వెలిగించొచ్చు అంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా మద్రాస్ హైకోర్టు (మధురై బెంచ్) సమర్ధించింది. గత కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ స్తంభంపై దీపం వెలిగించేందుకు ప్రయత్నించగా.. ప్రభుత్వం అడ్డుకుంది. అక్కడ దీపం వెలిగించడానికి వీల్లేదని ఆదేశించింది. పక్కనే దర్గా ఉండటం వల్ల, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
అంతేకాదు.. అక్కడ దీపం వెలిగించకూడదని శాస్త్రాల్లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రామ రవికుమార్ సహా పలువురు గత డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై స్పందించిన సింగిల్ జడ్జి.. దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం, దర్గా కమిటీ, వక్ఫ్ బోర్డు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి నిర్ణయాన్ని కొట్టివేయాలి కోరారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని కోర్టుకు తెలిపారు. దీప స్తంభం ఉన్న దేవాలయం దర్గాకు చెందినదని, ఇక్కడ దీపం వెలిగించకూడదని శాస్త్రంలో ఉందని, అలాగే దీపం వెలిగించడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.
ఏడాదిలో ఒక రోజు దీపం వెలిగించినంత మాత్రాన శాంతి భద్రతల సమస్య తలెత్తదని అభిప్రాయపడింది. అలాగే దీపం వెలిగించొద్దని శాస్త్రాల్లో లేదనేందుకు తగిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించలేదని తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ ఇక్కడ ఇబ్బంది కలిగితే.. అది ప్రభుత్వమే చేయించడానికి అవకాశం ఉందని, ప్రభుత్వం అలా దిగజారబోదని భావిస్తున్నట్లు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఆ రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై హర్షం వ్యక్తం చేశారు.