(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావించిన ఐదు రాష్ర్టాల ఫలితాలతో ‘ఇండియా’ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి పెద్దన్నపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్, ఉత్తరాదిలో నాలుగు రాష్ర్టాలలో ఘోర పరాజయం పాలుకావడం దీనిపై ప్రభావం చూపింది. ఫలితంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో బుధవారం జరగాల్సిన కూటమి భేటీ వాయిదా పడింది. ఈ సమావేశానికి హాజరు కావడానికి కూటమిలోని పార్టీలు పెద్దగా ఆసక్తి కనబర్చకపోగా వివిధ కారణాల దృష్ట్యా తాము హాజరు కాలేమని సమాచారం పంపించాయి. దీంతో కూటమి భేటీని ఈ నెల మూడో వారానికి వాయిదా వేసినట్టు కాంగ్రెస్ ప్రకటించింది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతుండటంతో ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమితో కలిసి నడవడానికి విపక్షాలు ఆసక్తి కనబర్చడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. వివిధ కారణాల వల్ల కూటమి నేతలు ఈ భేటీకి హాజరు కావడం లేదని సమాచారం ఇవ్వడంతో వారిని సంప్రందించి ఈ నెల 27 లేక 28న భేటీ కానున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తుఫాను బీభత్సం వల్ల రాలేనని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పిన కారణం ఒక్కటే విపక్ష నేతలు చెప్పిన కారణాల్లో నమ్మశక్యంగా ఉన్నట్టు సమాచారం. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీకి హాజరు కావడానికి ఆసక్తి కనబర్చడం లేదని ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే ఇటీవల జరిగిన అయిదు రాష్ర్టాల ఎన్నికల కారణంగా కూటమి సమావేశాన్ని నిర్వహించలేకపోయినట్టు కాంగ్రెస్ చెప్తున్నది. ఈ ఐదు రాష్ర్టాలో విజయం సాధించి కూటమిపై పెత్తనం చెలాయించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే ఆ పార్టీ అంచనాలు తలకిందులు కావడంతో కూటమి సమావేశానికి హాజరు కావడానికి వివిధ పార్టీల నేతలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాలో చర్చ జరుగుతున్నది.