లేని కొరతను కృత్రిమంగా సృష్టిస్తారు. ప్లాంట్లలో వారానికి సరిపడా బొగ్గు నిల్వలు కూడా ఉంచకుండా ఏవేవో కారణాలతో సరఫరాను నిలిపేస్తారు. తీరా.. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్నదని గగ్గోలు పెడతారు. ఇదే సమయంలో బొగ్గు కొరత రాకుండా జాగ్రత్తపడాలని విద్యుదుత్పత్తి కంపెనీలకు ఉచిత సలహానిస్తారు. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తారు. విదేశీ బొగ్గుపై ఆధారపడి పనిచేసే ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని ఆదేశాలిస్తారు. ఎవరి లబ్ధి కోసం కేంద్రంలోని మోదీ సర్కారు ఇదంతా చేస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా!
Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే విద్యుత్తు ప్లాంట్లన్నీ వచ్చే ఏడాది జూన్ 30 వరకూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజాగా ఆదేశాలిచ్చింది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్తో పాటు దేశీయ బొగ్గు సరఫరా తగినంతగా లేకపోవడంతోనే ఈ ఆదేశాలిచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ చట్టం, సెక్షన్ 11 ప్రకారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తాజా ఆదేశాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆప్త మిత్రుడు అదానీకి చెందిన కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే ప్రధాని మోదీ ఇలాంటి ఏకపక్ష విధానాలకు పాల్పడుతున్నట్టు సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.
దేశంలోని థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో విదేశీ బొగ్గును కనీసం 4 శాతం కలుపాలని గత నెలలో కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు కొరత రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయంపై ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసీడబ్ల్యూఎఫ్), ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఈఎఫ్ఐ) యూనియన్ సభ్యులు భగ్గుమన్నారు. దేశంలో బొగ్గు సంక్షోభం ఉందంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఓ కుంభకోణంగా అభివర్ణించారు. దేశంలో అసలు బొగ్గు కొరత ఉన్నదా? లేదా కృత్రిమ కొరత సృష్టించారా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ ఏకపక్ష నిర్ణయంతో వినియోగదారులపై పెను భారం పడే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశీ బొగ్గును కనీసం 4 శాతం కలుపాలన్న ప్రకటన వెలువడిన నెల రోజులకు దేశంలో బొగ్గు కొరతను కృత్రిమంగా సృష్టించే వ్యవహారం మొదలైనట్టు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తూ ఈ నెల రెండోవారంలో దేశంలోని 84 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటే పరిస్థితి దాపురించింది. వారానికి అవసరమైన నిల్వలు కూడా లేని దుస్థితి తలెత్తింది. బొగ్గు సరఫరాలో కొందరు అంతరాయాల్ని ఉద్దేశపూర్వకంగానే సృష్టించారన్న విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ, నిల్వలపై కేంద్రం ఏ ప్రకటనా చేయలేదు. మరోవైపు, అక్టోబర్ తొలి మూడు వారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, పండుగ సీజన్ కావడంతో విద్యుత్తు డిమాండ్ అంతకంతకూ పెరిగిపోయింది. దీని కోసమే ఎదురుచూస్తున్న కేంద్రం.. ఏదో సమస్యను పరిష్కరిస్తున్నట్టు నటిస్తూ.. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే విద్యుత్తు ప్లాంట్లన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటూ తాజాగా ఆదేశాలిచ్చినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలోని కీలకమైన బొగ్గు గనులే కాదు.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లోనూ అదానీ గ్రూప్నకు పెద్ద ఎత్తున బొగ్గు గనులున్నాయి. విదేశాల నుంచి భారత్కు అత్యధికంగా బొగ్గు ఎగుమతి చేస్తున్న కంపెనీ కూడా అదానీ గ్రూపుదే. అంతేకాదు.. దేశంలో అత్యధికంగా థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న కంపెనీ, బొగ్గును సరఫరా చేసే ప్రైవేట్ రైల్వే ర్యాక్స్ వ్యవస్థ కూడా అదానీదే. థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 4 శాతం విదేశీ బొగ్గు కలుపాలని ఆదేశించటం, వచ్చే జూన్ 30 వరకు ఆయా కంపెనీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రం పేర్కొనడం.. అదానీ గ్రూప్నకు సిరులు కురిపించడానికేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.