INDIA Alliance | న్యూఢిల్లీ : ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం జట్టుకట్టిన ఇండియా కూటమి పార్టీలు ప్రస్తుతం కాంగ్రెస్ను పట్టించుకోవడం లేదు. టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) వంటి ప్రధాన పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తున్నది. ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఎక్స్ వేదికగా తెలిపిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఢిల్లీ శాసన సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించారు.
తమకు మద్దతిచ్చినందుకు మమతకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. కష్టసుఖాల్లో అండగా ఉంటూ, ఆశీర్వదిస్తున్నందుకు మమత దీదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఇటీవల ఆరోపణలు చేయడంతో, ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కేజ్రీవాల్ మంతనాలు జరుపుతున్నట్లు, ఉద్ధవ్ మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో ఆప్ తరపున ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. 70 స్థానాలున్న ఢిల్లీ శాసన సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 5న, ఓట్ల లెక్కింపు వచ్చే నెల 8న జరుగుతాయి.