బెంగళూరు/లక్నో, ఫిబ్రవరి 27: హిమాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ సీటుకు జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ కొంపముంచింది. ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో రాజ్యసభ సీటు ‘చే’జారింది. ఇరు పార్టీల అభ్యర్థులకు చెరో 34 ఓట్లు రాగా, ఫలితం తేల్చేందుకు టాస్ వేయగా అదృష్టం బీజేపీని వరించింది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత అభిషేక్ మనుసింఘ్వీపై బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు. దేశవ్యాప్తంగా మూడు రాష్ర్టాల్లోని 15 స్థానాలకు మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. క్రాస్ ఓటింగ్ అభ్యర్థుల ఫలితాలను తారుమారు చేశాయి. కర్ణాటకలో మొత్తం నాలుగు స్థానాలకు గానూ అధికార కాంగ్రెస్ 3, బీజేపీ ఒక సీటును గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 10 స్థానాలకు గానూ అధికార బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకోగా, సమాజ్వాదీ పార్టీ రెండు సీట్లను గెలుచుకుంది.
కర్ణాటకలోని కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్కు ఓటు వేయగా.. మరో ఎమ్మెల్యే శివరామ్ ఓటింగ్కు రాలేదు.
యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోలింగ్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా.. ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఆర్పీ సింగ్, మాజీ ఎంపీ చౌదరి తేజ్వీర్ సింగ్, యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి అమర్పాల్ మౌర్య, రాష్ట్ర మాజీ మంత్రి సంగీతా బల్వంత్, పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్, పారిశ్రామిక వేత్త సంజయ్ సేథ్ గెలుపొందారు. ఇక సమాజ్వాదీ పార్టీ తరఫున సినీ నటి జయాబచ్చన్, దళిత నేత రామ్జీ లాల్ సుమన్ ఎన్నికయ్యారు. 41 మంది సభ్యులు జయకు ఓటేయటంతో ఆమెకు అత్యధిక ఓట్లు లభించాయి.
యూపీలో హైడ్రామా జరిగింది. ఓ వైపు క్రాస్ ఓటింగ్ ఆందోళన రేగుతుండగానే సమాజ్వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్పాండే రాజీనామా చేశారు. అంతకుముందు సోమవారం అఖిలేశ్ యాదవ్ సమావేశానికి 8 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సంఖ్యాబలం ప్రకారం బీజేపీ 7, ఎస్పీ 3 రాజ్యసభ సీట్లను గెలుచుకునే ఆస్కారం ఉన్నది. అయితే బీజేపీ ఎనిమిదో అభ్యర్థిని నిలబెట్టటంతో పోటీ రసవత్తరంగా మారింది. చివరకు క్రాస్ ఓటింగ్తో బీజేపీ 8 సీట్లను కైవసం చేసుకున్నది.