లక్నో : యూపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పోటెత్తిన వరదతో రాష్ట్రవ్యాప్తంగా 22 మంది మృత్యువాత పడ్డారు. తూర్పు యూపీలో భారీ వర్షాలు ముంచెత్తుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భారీ వర్షాలకు లక్నోలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో పక్కనే గుడిసెల్లో నివసిస్తున్న వారిపై శిధిలాలు పడటంతో 9 మంది కూలీలు మరణించిన ఘటన కలిచివేస్తోంది. ఇక ఉన్నావ్, ఫతేపూర్, ప్రయాగరాజ్, సీతాపూర్, రాయ్బరేలి, ఝాన్సీ జిల్లాల్లో వరద ఉధృతికి 13 మంది మరణించారని అధికారులు తెలిపారు.
ఇక లక్నోలో భవనం కూలిన ఘటనలో గాయపడిన వారంతా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ 4 లక్షల పరిహారం ప్రకటించిందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.