న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల జాబితాలో తొలిసారి ఒక పార్టీ పేరును ప్రస్తావించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)తోపాటు ఆయనకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను నిందితులుగా పేర్కొంది.
కాగా, కేజ్రీవాల్ సెవెన్ స్టార్ హోటల్లో బస చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. ఈ కేసులోని నిందితుడు బిల్లులు కొంతవరకు చెల్లించినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.
మరోవైపు ఈ కేసులో నేరారోపణలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చాటింగ్లను గుర్తించినట్లు సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. కేజ్రీవాల్ తన డివైజ్ల పాస్వర్డులు ఇచ్చేందుకు నిరాకరించారని చెప్పింది. అయితే హవాలా ఆపరేటర్ల డివైజ్ల ద్వారా ఆ చాటింగ్ల సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది.