న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: విదేశీ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని పెంచడమే ఇందుకు కారణం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న లగ్జరీ కార్లతోపాటు విద్యుత్తుతో నడిచే కార్లు కూడా ప్రియంకానున్నాయి.
40 వేల డాలర్ల లోపు ధర కలిగిన లేదా 3,000 సీసీ ఇంజిన్ కలిగిన పెట్రోల్ వాహనంతోపాటు 2,500 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన డీజిల్ వాహనాలపై ప్రస్తుతం దిగుమతి సుంకం 60 శాతంగా ఉండగా..దీనిని 70 శాతానికి పెంచింది నరేంద్ర మోదీ సర్కార్. భారత్లో అధిక పన్నులు వసూలు చేస్తున్నారని అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఆరోపిస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా మోదీ సర్కార్ మళ్లీ దిగుమతి సుంకాన్ని పెంచడం విశేషం. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు సెమీ-నాక్డ్ డౌన్(ఎస్కేడీ)లపై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 35 శాతానికి పెంచింది