IMD | ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో వైపు రాబోయే మూడు నుంచి ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి 5 డిగ్రీల వరకు పెరుగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈశాన్య భారతం, పశ్చిమ హిమాలయ ప్రాంతం మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగాయని చెప్పింది. అయిదే, హీట్వేవ్స్ ఏర్పడే అవకాశం లేదని తెలిపింది. అదే సమయంలో తూర్పు ప్రాంతంలోని ద్రోణి కేరళ నుంచి విదర్భ వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరాఠ్వాడా మీదుగా తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో ఉందని.. ఈ దాంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఆదివారం సెంట్రల్ మహారాష్ట్ర, మరఠ్వాడా, కొంకణ్, గోవాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళలోని పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. మధ్య, తూర్పు భారతదేశంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.