చెన్నై: తమిళనాడును వరణుడు ముంచెత్తుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెన్నై, సమీప జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rainfall) కురుస్తాయని ప్రకటించింది. వాతావరణ శాఖ అధికారులు చెన్నైకి రెడ్ అలర్ట్ (Red alert) జారీచేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరులో అతిభారీ వర్షాలు కురుస్తాయని, విళ్లుపురం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
చెన్నైలో 20 సెంటీమీట్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీంతో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. చెన్నై కార్పొరేషన్లో వార్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని, అవసరమైన సహాయం అందజేస్తామని వెల్లడించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో థేని జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.