న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిర్దోషిగా బయటపడిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి శుక్రవారం సవాలు విసిరారు. మోదీకి దమ్ముంటే ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి ఏం జరుగుతుందో చూడాలని ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటలకే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేజ్రీవాల్ సవాలు చేశారు. 10 కన్నా ఎక్కువ సీట్లను బీజేపీ గెలుచుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ తనపై కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి దిగజారిపోయిందని ఆయన విమర్శించారు. మోదీ, అమిత్ షాల పదవీ వ్యామోహానికి 3 కోట్ల ఢిల్లీ ప్రజలు బలవుతున్నారని ఆయన ఆరోపించారు.
మోదీకి దమ్ముంటే ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన సవాలు చేశారు. మీకు 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. మీ పాలనతో ఢిల్లీ ప్రజలు విసిగివేసారిపోయారు అంటూ ఆయన మోదీపై మండిపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని గద్దె దించేందుకు స్వతంత్ర భారతంలో బీజేపీ పన్నిన అతిపెద్ద రాజకీయ కుట్రగా ఢిల్లీ మద్యం పాలసీ కేసును కేజ్రీవాల్ అభివర్ణించారు. ఆప్ లాంటి పార్టీలను నాశనం చేసేందుకు, అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నించడం మాని దేశ ప్రయోజనాల కోసం పనిచేయడంపై దృష్టి పెట్టాలని మోదీ, అమిత్ షాకు ఆయన హితవు చెప్పారు. అధికారం కోసం ఈ రకంగా దేశంతో, రాజ్యాంగంతో ఎవరూ ఆడుకోరాదని ఆయన సూచించారు.
తనపై నమోదైన కేసులో ఏమాత్రం బలం లేదని, మొదట్నుంచీ అది కట్టుకథలే ఆధారంగా బనాయించిందని ఆయన విమర్శించారు. ఈ కేసులో పస ఉండి ఉంటే విచారణ 15 నుంచి 20 ఏండ్లు పట్టేదని, పెద్ద సంఖ్యలో సాక్షులను విచారణకు పిలిచేవారని, సాక్ష్యాలను కోర్టుకు సమర్పించి ఉండేవారని ఆయన చెప్పారు. ఇదో మోసపూరిత, నకిలీ, పనికిమాలిన, తప్పుడు కేసుగా న్యాయస్థానమే అభిప్రాయపడిందని, ఇది తన మాటలు కాదని, కోర్టు చెప్పిన మాటలేనని కేజ్రీవాల్ అన్నారు. మోదీ, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండు చేశారు.
ఈ కుట్రకు ప్రధాన సూత్రధారులు ఇద్దరే-నరేంద్ర మోదీ, అమిత్ షా. ఈరోజు వారిద్దరూ యావద్దేశానికి క్షమాపణ చెప్పాలి. ఆప్ని నాశనం చేసేందుకు వారిద్దరూ కలసి కుట్రచేశారు అని ఆయన సూటిగా ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ చార్జిషీట్ దాఖలు చేశాయని ఆయన చెప్పారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని ప్రాసిక్యూషన్తో ముందుకు సాగడం సమర్థనీయమా కాదా అని మాత్రమే కోర్టు నిర్ణయించాల్సి ఉందని, కోర్టు విచారణ ఇంకా ప్రారంభం కాలేదని కేజ్రీవాల్ వివరించారు. ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా అన్న విషయాన్ని మాత్రమే కోర్టు నిర్ణయించాల్సి ఉందని ఆయన చెప్పారు.
సాక్ష్యాలను, సాక్షుల వాంగ్మూలను పరిశీలించిన అనంతరం కోర్టు దాదాపు 600 పేజీల తన ఉత్తర్వులో తగినన్ని సాక్ష్యాలేగాక తగినన్ని సాక్షుల వాంగ్మూలాలు కూడా లేవని అభిప్రాయపడిందని ఆయన చెప్పారు. ప్రాసిక్యూట్ చేసేందుకు దారపు పోగంత ఆధారం కూడా లేదని కోర్టు పేర్కొందని ఆయన అన్నారు. కేసు విచారణకు వెళ్లుంటే అది కొలిక్కి రావడం అసాధ్యమయ్యేదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును స్వాగతించిన కేజ్రీవాల్ ఎట్టకేలకు న్యాయం లభించిందని, మోసం పైన నిజం గెలిచిందని ఆయన చెప్పారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సహా తన లీగల్ టీముకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.