న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతోపాటు కోస్ట్గార్డ్కు సుప్రీంకోర్టు (Supreme Court) చీవాట్లు పెట్టింది. మహిళా అధికారిణులకు పర్మినెంట్ కమిషన్ అంశంపై స్పందించకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొంది. మహిళలను అలా వదిలేయబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్కు చెందిన ఒక మహిళా అధికారిణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోస్ట్ గార్డ్లో లింగ వివక్ష, అసమానతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అర్హులైన షార్ట్ సర్వీస్ కమిషన్ మహిళా అధికారిణులను పర్మినెంట్ కమిషన్గా చేయాలని కోరింది.
కాగా, సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపింది.
కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపించారు. ఆర్మీ, నేవీకి భిన్నంగా కోస్ట్గార్డ్ పనిచేస్తుందని చెప్పారు. అయితే 2024లో ఈ వాదన తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పర్మినెంట్ కమిషన్ నుంచి మహిళలను మినహాయించడాన్ని తప్పుపట్టింది. ‘మీరు (కేంద్రం) చేయకపోతే, మేం చేస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ ఘాటుగా అన్నారు. ఈ అంశాన్ని పరిశీలించాలని, మార్చి 1 నాటికి ప్రతిస్పందన దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.