Raghav Chadha | ఢిల్లీలోని భారత పార్లమెంట్లో భారీ భద్రతాలోపం (security breach) బయటపడిన విషయం తెలిసిందే. ఈ భద్రతా ఉల్లంఘనపై పలువురు ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) తాజాగా స్పందించారు. మన దేశంలో అత్యంత సురక్షితమైనది పార్లమెంట్ భవనమని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ భవనమే సురక్షితంగా లేదని.. అలాంటిది మిగిలిన దేశం గురించి మనం ఏం చెప్పగలం..? అని ప్రశ్నించారు.
‘పార్లమెంట్ భవనం మన దేశంలో అత్యంత సురక్షితమైన భవనం. కానీ ఇప్పుడు ఆ భవనమే సురక్షితం కాకపోతే మిగిలిన దేశం గురించి మనం ఏం చెప్పగలం..? భారతదేశం సురక్షితంగా ఉందా?’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ జరపాలని రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ‘ఈ ఘటనకు పాల్పడిన వారు నాలుగంచెల భద్రతను దాటుకొని ఎలా లోపలికొచ్చారు..? వారిని లోపలికి ఎవరు అనుమతించారు..? భద్రతా ప్రోటోకాల్లను ఎందుకు సరిగ్గా పాటించలేదు..?’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ ఘటనపై విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘బీజేపీయేతర ఎంపీలందరికీ ఒక న్యాయబద్ధమైన డిమాండ్ ఉంది. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై చర్చ జరగాలి. పార్లమెంటుకు భద్రత లేకపోతే దేశాన్ని భద్రంగా భావించవచ్చా..? ఈ ఘటనపై ప్రభుత్వం నుంచి కాకపోతే ఇంకెవరి నుంచి సమాధానం కోరుకుంటాం. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షా సభలో వివరణ ఇవ్వాలి’ అని రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు.
Also Read..
Parliament security breach | పార్లమెంట్లో భద్రతా వైఫల్యాలకు కారణం నిరుద్యోగం : రాహుల్ గాంధీ
Shivraj Singh Chouhan| యువకుడి ప్రాణాలు కాపాడి.. మానవత్వం చాటుకున్న శివరాజ్సింగ్ చౌహాన్
Gang Raped | కదులుతున్న బస్సులో దళిత యువతిపై సామూహిక అత్యాచారం.. ఒకరు అరెస్ట్