Mohan Bhagwat : కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్ర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. హత్యలు, దాడులు, దోపిడీలు వంటి ఘటనలతో బంగ్లాలో హిందువులకు కొంతకాలంగా రక్షణ లేకుండా పోయింది. ఈ అంశంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. బంగ్లాదేశ్లో ఉన్న 1.25 కోట్ల మంది హిందువులు తమ హక్కుల కోసం పోరాడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మద్దతు ఇస్తారని భగవత్ అన్నారు. ఆరెస్సెస్ వందేళ్లు పూర్తైన సందర్భంగా ముంబైలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘బంగ్లాదేశ్లో 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వారితోపాటు మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మద్దతు ఇస్తారు’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇండియాలో కూడా మైనారిటీలు, ఇతర అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియాలో ఇలాంటి అంశాలకు సంబంధించి గత ప్రభుత్వాలు సరిగ్గా స్పందించలేదు. జనాభా పెరుగుదల, మార్పులను ప్రభుత్వాలు గుర్తించలేదు. దీనికి కొన్ని వర్గాల జననాల రేటు, అక్రమ వలసలు వంటివి ప్రధాన కారణాలు. ఇప్పుడే ప్రభుత్వం దీనిపై స్పందిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఆరెస్సెస్ కులాలకు ప్రాధాన్యం ఇవ్వదు. అన్ని వర్గాలను కలపాలన్నదే మా ధ్యేయం. ఎస్సీ, ఎస్టీల మీద వివక్ష లేదు. ఇది బ్రాహ్మణులు స్తాపించిన సంస్థ అయినప్పటికీ ఎవరైనా దీనికి అధ్యక్షులు కావొచ్చు.
మాకు వచ్చే నిధుల గురిచి చాలా మంది అడుగుతున్నారు. మేం మా కార్యకర్తల నుంచి నిధులు సేకరిస్తాం. మేం ఎక్కడికైనా వెళ్తే ఫుడ్డుకు డబ్బులు అడిగే బదులు ఆహారమే అడుగుతాం. మేం హోటళ్లలో ఉండం. కార్యకర్తల ఇండ్లలోనే బస చేస్తాం. మాకు అధికారం అవసరం లేదు. అందరినీ ఏకం చేయాలన్నదే మా లక్ష్యం. దేశాన్ని విడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. దేశాన్ని విడదీయాలనుకున్నవాళ్లే విచ్ఛిన్నమవుతారు’’ అని మోహన్ భగవత్ అన్నారు.