కోల్కతా, మార్చి 14: మామూలు పులి కంటే దెబ్బ తిన్న పులి చాలా ప్రమాదకరమని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కాలికి గాయమైన అనంతరం తొలిసారి ఆమె ఆదివారం కోల్కతాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. గతంలో చెప్పినట్టుగానే మమత వీల్చైర్లో కూర్చొని ఎన్నికల ప్రచారం చేశారు. తనను తాను దెబ్బ తిన్న పులితో పోల్చుకొన్నారు. ‘నాపై గతంలో కూడా ఎన్నో దాడులు జరిగాయి. ఎప్పుడూ ఎవరి ముందు తలవంచలేదు. ఇకముందూ తల వంచను. దెబ్బ తిన్న పులి చాలా ప్రమాదకరం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతా వీల్చైర్లోనే కూర్చొని ప్రచారం చేస్తానని చెప్పారు. కోల్కతాలోని మేయో రోడ్డులో దాదాపు 5 కిలోమీటర్లు మమత ర్యాలీ జరిగింది. మధ్యలో ఆమె మాట్లాడారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, కానీ ప్రజల బాధ కంటే కాలి నొప్పి పెద్దదేమీ కాదని అన్నారు. ర్యాలీలో టీఎంసీ కార్యకర్తలు బెంగాల్ బిడ్డ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ర్యాలీకి ముందు ‘మన పుణ్య భూమిని కాపాడుకొనేందుకు మన యుద్ధాన్ని కొనసాగిద్దాం. ఈ క్రమంలో బాధలు తప్పవు. కానీ భరిద్దాం. పిరికితనానికి తలవంచొద్దు’ అని ట్వీట్ చేశారు. 2007లో నందిగ్రామ్ ఉద్యమం సమయంలో పోలీసుల కాల్పుల్లో 14 మంది చనిపోయినదానికి గుర్తుగా ఆదివారం(నందిగ్రామ్ దివస్) ఈ ర్యాలీ నిర్వహించారు.
మమతపై ఎలాంటి కుట్ర జరగలేదని ఎన్నికల సంఘం నిర్ధరించింది. కుట్ర జరిగిందనేందుకు ఆధారాల్లేవని తెలిపింది. భద్రతాపరమైన లోపాలతో జరిగిన ప్రమాదం వల్లే ఆమెకు గాయాలయ్యాయని పేర్కొన్నది. మమతకు గాయంపై ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చిన అనంతరం ఈ మేరకు ప్రకటన చేసింది. మమతకు తగిన భద్రత కల్పించడంలో విఫలమైన భద్రతాధికారి వివేక్ సహాయ్ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తికి తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత సెక్యూరిటీ డైరెక్టర్పై ఉందని, అది ఆయన ప్రాథమిక విధి అని ఆదేశాల్లో పేర్కొన్నది. డీజీపీ సలహాతో వివేక్ స్థానంలో మరొకరిని సెక్యూరిటీ డైరెక్టర్గా నియమించాలని పశ్చిమ బెంగాల్ సీఎస్ను ఆదేశించింది. అలాగే మమత గాయపడ్డ పూర్బ మేదినీపూర్ ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్ను కూడాఈసీ సస్పెండ్ చేసింది.