శ్రీనగర్ : కేంద్రం తీసుకోబోయే చర్యలకు భయపడిన హురియత్ కాన్ఫరెన్స్ (Hurriyat) నేతలు.. శ్రీనగర్ కార్యాలయం బోర్డును తొలగించారు. సయ్యద్ అలీ షా గీలాని నేతృత్వంలోని హురియత్ కాన్ఫరెన్స్లోని తీవ్రవాద తెహ్రీక్-ఏ-హురియత్ తన కార్యాలయం సైన్ బోర్డును తొలగించింది. ఈ తీవ్రవాద గ్రూపు ప్రధాన కార్యాలయం శ్రీనగర్లోని హైదర్పోరా ప్రాంతంలో ఉన్నది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ) కింద వేర్పాటువాద సంస్థకు చెందిన మితవాద వర్గాలను నిషేధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.
కేంద్ర హోంశాఖ చర్యలకు భయపడి వారే ఈ తెహ్రీక్-ఏ-హురియత్ కార్యాలయం బోర్డులను తీసివేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హురియత్పై యూఏపీఏ సెక్షన్ 3 (1) కింద కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఏదైనా సంస్థ చట్టవిరుద్ధమైన సంస్థగా మారిందని భావిస్తే అటువంటి సంస్థను నిషేధించవచ్చు. కశ్మీర్ లోయలో తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు హురియత్ నేతలు 2017 నుంచి జైలులో ఉన్నారు. జైలు జీవితం గడుపుతున్న వారిలో గీలానీ అల్లుడు అల్తాఫ్ అహ్మద్ షా, వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ వాతలీ, గీలానీ అనుచరుడు, అధికార ప్రతినిధులు అయాజ్ అక్బర్, పీర్ సైఫుల్లా, షాహిద్ ఉల్ ఇస్లాం ఉన్నారు.
26 సంస్థలను ఏకతాటిపైకి తెచ్చి 1993 లో జమ్ముకశ్మీర్లో హురియత్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. 2005 లో రెండుగా విడిపోయి ఏర్పాటైన జమాతే ఇస్లామీ, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్పై కేంద్రం ఇప్పటికే నిషేధం విధించింది.
‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ తీరు
ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వ్యాపారం చేయండి.. ఎలాగంటే..?
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..