న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్రతకు ప్రతీఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. ఈ వ్యాఖ్యలపై మహిళా హక్కుల కార్యకర్తలు, విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. మహిళా భద్రతకు మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు ఏమిటని అకంచా శ్రీవాస్తవ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అకంచా శ్రీవాస్తవ ప్రశ్నించారు. మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన నిర్భయ ఫండ్ నిధులు ఏమవుతున్నాయన్నారు.
మహిళా సాధికారతకు బడ్జెట్లో చేస్తున్న కేటాయింపులు అంతకంతకూ తగ్గుతున్నాయని ఆలిండియా ప్రోగ్రెసివ్ విమెన్ అసోసియేషన్ సభ్యురాలు కవితా కృష్ణన్ మండిపడ్డారు. దేశంలో మహిళలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. వారికి ఇచ్చే గౌరవంపై ఆయన, ఆయన పార్టీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని తృణమూల్ ఎంపీ డెరక్ ఒబ్రెయిన్ అన్నారు. గత ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘దీదీ ఓ దీదీ’ అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ఉదహరిస్తూ చురకలు అంటించారు. మహిళల పట్ల బీజేపీ నేతల ప్రవర్తనను సమీక్షించుకోవాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజీ మోదీకి హితవు పలికారు. మోదీ మాటలు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన లేదని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఎద్దేవా చేశారు.