రాంచీ, మే 6: లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే ఓ వ్యకి నివాసంలో సుమారు రూ.35 కోట్ల నగదు స్వాధీనం చేసుకొన్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాలు సోమవారం వెల్లడించాయి. రాంచీలోని గడిఖానా చౌక్ ఏరియాలోని మంత్రి పీఏ పనిమనిషి నివాసంలో డబ్బు కట్టలు ఉన్న బ్యాగులను సీజ్ చేశామని పేర్కొన్నది. గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ ఇంజినీర్ వీరేంద్ర కుమార్ రామ్పై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ సోదాలు చేసినట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై వీరేంద్ర రామ్ను ఈడీ గత ఏడాది అరెస్టు చేసింది.
తనకు సమాచారం లేదన్న మంత్రి
తాజా సోదాలపై మంత్రి ఆలంగీర్ ఆలం ను వార్తా సంస్థ పీటీఐ సంప్రదించగా.. దీనిపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తు పూర్తి చేసే వరకు ఎవరూ ఎలాంటి నిర్ణయానికి రావొద్దన్నారు. సంజీవ్ లాల్ గతంలో ఇద్దరు మాజీ మంత్రులకు కూడా కార్యదర్శిగా చేశారని పేర్కొన్నారు. హస్తం పార్టీలో కీలక నేతగా ఉన్న ఆలంగీర్ ఆలం ప్రస్తుతం పకూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, పెద్దమొత్తంలో దొరికిన నోట్ల కట్టలను లెక్కించేందుకు ఈడీ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఎనిమిది క్యాష్ కౌంటింగ్ మెషీన్లను ఉపయోగించి 17 గంటల పాటు లెక్కింపు చేపట్టారు. తాజా ఆపరేషన్లో భాగంగా ఈడీ మొత్తం ఆరుచోట్ల దాడులు చేసింది. వీటిల్లో రెండు చోట్ల జరిపిన సోదాల్లో రూ.2.93 కోట్లు, రూ.10 లక్షల చొప్పున ఏజెన్సీ రికవరీ చేసింది. కొంత బంగారాన్ని కూడా సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. జార్ఖండ్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ తాజా పరిణామం రాజకీయ దుమారం రేపింది. సోదాల్లో దొరికిన సొమ్ముతో కాంగ్రెస్ మంత్రికి ఉన్న సంబంధాలపై బీజేపీ ప్రశ్నలు లేవనెత్తింది. ఆలంగీర్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ డిమాండ్ చేశారు.