బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతం మరుభూమిలా మారింది. మూడు రైళ్ల బోగీలు చెల్లాచెదురుగా పడివున్నాయి. శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. ఓ పక్క బాధితులు ఆర్తనాదాలు చేస్తుండగా.. మరో పక్క రాత్రంతా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
గ్యాస్ టార్చీలు, ఎలక్ట్రిక్ కట్టర్లు వినియోగించి బోగీలను కత్తిరిస్తూ వాటిలో ఇరుక్కున్న బాధితులను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. గ్యాస్ కట్టర్లతో బోగీలను ముక్కలుముక్కలుగా కత్తిరించి తీసేస్తూ వాటి కింద నలిగిపోయిన మృతదేహాలను వెలికితీశారు. బాధితులకు ప్రథమ చికిత్స కోసం ఘటనా ప్రాంతంలో రాత్రికి రాత్రే 45 మొబైల్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
దాదాపు 200 అంబులెన్స్లను, 50 బస్సులను అందుబాటులో ఉంచారు. బాధితులను వెలికితీయగానే ప్రాణాపాయం లేని వారికి మొబైల్ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేయించి బస్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ఇలా శనివారం మధ్యాహ్నం వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్లలో నేరుగా ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కాగా, నిన్న రాత్రి 7 గంటలకు హౌరా-బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు మూడు ఒకదానినొకటి ఢీకొనడంతో ఘోరం జరిగింది.