న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం (Heat Waves) కొనసాగుతుండగా బిహార్, యూపీలో పలువురు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలతో ఎండ వేడిమి తాళలేక అనారోగ్యాలకు గురై జనం పిట్టల్లా రాలుతున్నారు. వేడిగాడ్పుల కారణంగా ఆస్పత్రుల్లో చేరిన వారిలో గుండెపోటు, బ్రైన్ స్ట్రోక్, డయేరియా, జ్వరం, ఊపిరిఆడకపోవడం వంటి కారణాలతో మృత్యువాతన పడుతున్నారని సమాచారం.
వడగాడ్పులతో స్ట్రోక్కు గురైన వారితో పాటు అప్పటికే పలు వ్యాధులు, తీవ్ర అనారోగ్యాలకు గురైన వారిలో పరిస్ధితి విషమిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలో రక్తపోటును తగ్గించడంతో గుండె పోటు ఘటనలను ప్రేరేపిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్ధ్యాన్ని శరీరం కోల్పోతున్నదని, ఫలితంగా తీవ్ర అలసట, నీరసం, వడదెబ్బ, హైపర్థర్మియా వంటి అస్వస్ధతలకు లోనవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఎండ వేడిమితో శరీరం ఒత్తిడికి లోనై వాసోప్రెసిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేయడంతో బీపీ పెరిగి హృద్రోగాలకు దారితీస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో పాటు మైగ్రేన్, ఆటోఇమ్యూన్ డిజార్డర్లతో బాధపడేవారికి ఎండ వేడిమి మరింత కీడు చేస్తుందని చెబుతున్నారు. ఇక డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు దాహం వేయకున్నా తగినంత నీరు తాగాలి. మద్యంతో పాటు కేఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా బీపీ, షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో సన్స్క్రీన్ లోషన్తో పాటు టోపీ ధరించాలి. శరీరాన్ని చల్లబరుచుకునేందుకు ఏసీ, ఫ్యాన్, కూలర్ వసతి ఉన్న ప్రదేశాల్లో అధిక సమయం వెచ్చించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read More :