న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్కు బయలుదేరిన ఇండిగో విమానంలో.. టేకాఫ్ ఆయిన తర్వాత కాసేపటికే సమస్య వచ్చింది. విమానం ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని సంప్రదించి సమాచారం ఇచ్చాడు.
ఫ్లైట్ ప్రియారిటీ ల్యాండింగ్కు అనుమతి కావాలని కోరాడు. దాంతో ఫ్లైట్ను తీసుకొచ్చి తిరిగి ఢిల్లీలోనే ల్యాండ్ చేయాలని ATC సూచించింది. పైలట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, విమానంలో అగ్నిప్రమాదం జరిగిందని వచ్చిన పుకార్లను అధికారులు కొట్టిపారేశారు.
ఫ్లైట్లో ఎలాంటి అగ్నిప్రమాదం జరుగలేదని చెప్పారు. అయితే, ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువలేదు. DGCA ప్రకటన వస్తే ఘటనకుగల కచ్చితమైన కారణం ఏమిటో తెలిసే అవకాశం ఉంది.