Manipur Violence | రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) అట్టుడుకుతోంది. గత రెండు నెలలుగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుతుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపలులోకి తీసుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ కేసులో ఓ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పు పెట్టారు. ప్రధాన నిందితుడు హురైన్ ఇంటికి నిప్పు పెట్టారు.
మహిళల్ని ఊరేగించిన అమానవీయ ఘటన మణిపూర్లోని కంగ్పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన జరిగింది. అయితే బుధవారం ఆ వీడియో మరోసారి వైరల్ అయ్యింది. ఆ వీడియోపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. నిందితులకు మరణదండన ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కిడ్నాప్, గ్యాంగ్రేప్, మర్డర్ కింద కేసు బుక్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం ప్రధాన నిందితుడు హురైన్ హెరదాస్ సింగ్ (32) అరెస్ట్ చేయగా, సాయంత్రం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
మణిపూర్లో మెజారిటీ వర్గమైన మైతీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వటంతో మే 3న ఒక్కసారిగా జాతుల ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. హిందువులైన మెజారిటీ మైతీలకు, గిరిజనులైన మైనారిటీ కుకీ, నాగా మరికొన్ని జాతులకు మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి ఈ గిరిజనులకు చెందిన చర్చిలను కూల్చేయటం, గ్రామాలను తగులబెట్టడం సర్వసాధారణం అయిపోయింది. మైతీ వర్గంలోని కొందరు భద్రతా బలగాల వద్ద ఆయుధాలను దొంగిలించి మారణహోమానికి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా మే 4న దాదాపు వెయ్యిమంది మైతీలు కాంగ్పోక్పీ జిల్లాలోని బీ ఫైనోమ్ గ్రామంపై దాడిచేశారు. ఇండ్లన్నింటినీ తగులబెట్టారు. భయంతో పారిపోతున్న కుకీలను పట్టుకొని కొట్టి చంపేశారు.
ఈ మారణకాండకు భయపడి ఓ కుటుంబం అడవిలోకి పారిపోయింది. వారిని పోలీసులు రక్షించి స్టేషన్కు తీసుకెళ్తుండగా ఆ అల్లరిమూక అడ్డగించింది. ముగ్గరు మహిళలను, ఇద్దరు పురుషులను బలవంతంగా పోలీసుల నుంచి లాక్కెళ్లింది. మహిళల్లో 20 ఏండ్ల యువతితోపాటు 40, 50 ఏండ్లున్న మరో ఇద్దరు ఉన్నారు. వీరిని నగ్నంగా మార్చి ఊరేగించారు. యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆ యువతి తండ్రితోపాటు సోదరున్ని చంపేశారు. పోలీసుల కండ్లెదుటే జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మే 18న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ దారుణానికి పాల్పడినవాళ్లంతా మైతీ లీపున్, కాంగ్లీపాక్ కంబలూప్, అరంబై తెంగోల్, వరల్డ్ మైతీ కౌన్సిల్, షెడ్యూల్డ్ ట్రైబ్ డిమాండ్ కమిటీ తదితర మైతీ సంఘాలకు చెందినవారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దాదాపు 70 రోజులైనా బాధ్యులను పోలీసులు అరెస్టు చేయలేదు. తాజాగా వీడియో వైరల్ కావటంతో ఇద్దరిని అరెస్టు చేశారు.
జాతుల ఘర్షణలతో మణిపూర్లో వందల గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. వందలకొద్ది చర్చిలను దుండగులు నేలమట్టం చేశారు. వేల ఇండ్లు బూడిదయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారమే 140 మంది చనిపోయారు. 50 వేలమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకొంటున్నారు. పోలీసులు అక్కడే ఉన్నా కాపాడలేదు: బాధితులు తమపై దారుణం జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారని, కానీ కాపాడలేదని బాధిత మహిళల్లో ఒకరు వాపోయారు. నలుగురు పోలీసులు కారులో కూర్చొని హింసను చూస్తూ ఉండిపోయారని తెలిపారు. మహిళలను నగ్నంగా ఊరేగించడం పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సైంత సీరియ్ అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Also Read..
Earthquake | జైపూర్ ను కుదిపేసిన వరుస భూకంపాలు.. అరగంటలో మూడు సార్లు కంపించిన భూమి
Heavy Rains | రెస్క్యూ, ఎమర్జెన్సీ సేవల కోసం కాల్ చేయాల్సిన నంబర్లు ఇవే!
Health Tips | డయాబెటిస్ రోగులు దానిమ్మ తినొద్దా?