Heavy Rains | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అగ్నిమాపకశాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 210 మందిని మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో అప్రమత్తమైన అగ్నిమాపకశాఖ హోంగార్డులు, డీఎఫ్వోలను రంగంలోకి దించింది. నిజామాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో బోట్లతో రెస్క్యూ ఆపరేషన్ కోసం సిబ్బందిని మోహరించినట్టు ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
నీళ్లలో మునిగిపోతున్న వారిని రక్షించేందుకు ప్రత్యేకంగా 149 మం దికి శిక్షణ ఇప్పించినట్టు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో 18 బోట్లను సిద్ధంగా ఉంచారు. నీరు భారీగా నిలిచినచోట బయటకి పంపేందుకు 11 డీవాటరింగ్ పంప్స్తోపాటు లైఫ్ జాకెట్స్, తాళ్లు, కట్టర్లు, ఏరియల్ లైటింగ్ సెట్లు వంటి వాటిని సిబ్బందికి అందజేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వాటర్ రెస్క్యూ కోసం 30 మం దిని కేటాయించారు. వీరితో పాటు వాటర్ రెస్క్యూ ఫోర్స్ కోసం ప్రత్యేకంగా 50 మందిని సిద్ధంగా ఉంచారు. రెస్క్యూ కాల్స్, ఇతర అత్యవసర సేవల కోసం అగ్నిమాపకశాఖ కంట్రోల్ రూం నంబర్లు 99499 91101, 87126 99444, 87126 99464 కు ఫోన్ చేయాలని ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు.