చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) తడిసిముద్దవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి (Heavy Rains) కురుస్తున్నది. దీంతో కడలూర్, మైలాదుతురై, విల్లుపురం జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో (Puducherry) కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు. ఇక చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, చుద్దలోర్ జిల్లాల్లో, పుదుచ్చేరిలో మంళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎగువ వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, తమిళనాడులో తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికి ఈశాన్య రుతుపవనాలే కీలకం. గతవారం వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది.