Manipur | న్యూఢిల్లీ : మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్షాలు మరోసారి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చాయి. బీఆర్ఎస్ తరపున ఏడుగురు రాజ్యసభ సభ్యులు నోటీసులు ఇచ్చారు. లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసును బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు దాఖలు చేశారు. ఉభయసభల్లో సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని బీఆర్ఎస్ తమ సభ్యులకు విప్ జారీ చేసింది.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు కూడా ఈరోజు సభ ముందుకు రానున్న నేపథ్యంలో తమ సభ్యులకు విప్ జారీ చేశాయి విపక్షాలు. లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ఢిల్లీ ప్రభుత్వంలో పని చేసే ఉన్నతాధికారులకు బదిలీల అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనున్నాయి.