(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): దీపావళి వేడుకల సందర్భంగా గుజరాత్లోని వడోదరలో మతఘర్షణలు చెలరేగాయి. సోమవారం రాత్రి వడోదరలోని పానిగేట్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. హింసకు కచ్చితమైన కారణం తెలియదని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యస్పాల్ జగనియా అన్నారు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులపై పెట్రోలు బాంబులు వేయడంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఇదే కాదు గత ఏడాది కాలంగా ప్రతి ముఖ్యమైన పండగ రోజున గుజరాత్లోని ఏదో మూల.. మత ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఏడాదిలో ఏదో ఒక పండగ రోజు అల్లర్లు జరిగితే ఏమీ అనుమానం రాదు. కానీ ప్రతి పండుగకీ.. గుజరాత్లో అల్లర్లు జరుగుతూనే వస్తున్నాయి. మొన్నటి దసరా పండగరోజూ అల్లర్లు జరిగాయి. శ్రీరామనవమికీ రెండు వర్గాలు కొట్టుకున్నాయి. దుర్గా నవరాత్రులు, గణేశ్ నిమజ్జనం.. ఇలా ప్రతి పండగ రోజూ ఘర్షణలే.
దసరా
గుజరాత్లోని ఖేడా, వడోదర రెండు ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దుండగులు వాహనాలను తగులబెట్టారు. పోలీసులు 40 మందిని అరెస్టు చేశారు.
శ్రీరామనవమి
ఏప్రిల్లో జరిగిన శ్రీరామ నవమికీ గుజరాత్లోని రెండు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. హిమ్మత్నగర్, ఖంబాత్ నగరాల్లో భక్తులు ర్యాలీ తీస్తుండగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది. రాళ్లు రువ్వుకున్నారు. అల్లర్లలో ఒకరు మరణించారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు.
వినాయక చవితి
ఆగస్టులో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పానిగేట్లో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తి రాళ్లు రువ్వుకున్నారు.
ఎన్నికల కోసమేనా?
దేశవ్యాప్తంగా హిందూ, ముస్లింలు కలిసి పండుగలు జరుపుకుంటున్నప్పుడు.. ఒక్క గుజరాత్లోనే ప్రతి పండక్కీ అల్లర్లు చెలరేగటం వెనుక పలువురు రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మత ఘర్షణలు వ్యూహాత్మకమేనని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవడం కోసం బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదని ఆరోపిస్తున్నారు.