న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారం ఢిల్లీ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. తాను నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మను తప్పించాలని మరోసారి కోరారు. అదే కేసులో కేంద్రం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ కింద ఆ న్యాయమూర్తి కుమారుడు పని చేస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. ఇది రాజకీయంగా సున్నితమైన కేసు అని తెలిపారు. దీంతో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందు జరిగే విచారణ నిష్పక్షపాతంగా లేదా తటస్థంగా ఉండదనే తీవ్రమైన, స్పష్టమైన, సహేతుకమైన అనుమానం తనకు ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ పిటిషన్పై విచారణ నుంచి ఆ న్యాయమూర్తిని తప్పించాలని కేజ్రీవాల్ కోరారు.
కాగా, ట్రయల్ కోర్టు కొట్టేసిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును జస్టిస్ శర్మ విచారించడంపై కేజ్రీవాల్ అదనపు అభ్యంతరాలు లేవనెత్తారు. తన అరెస్టును సవాల్ చేస్తూ గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్పై తనకు ఉపశమనాన్ని ఆమె నిరాకరించారని, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించారని పేర్కొన్నారు. అలాగే ఆ న్యాయమూర్తి ‘బలమైన, నిశ్చయాత్మకమైన’ వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న న్యాయవాదుల సంస్థ అయిన అధివక్త పరిషత్ నిర్వహించిన కార్యక్రమాలకు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ పలుమార్లు హాజరయ్యారని కూడా ఆయన ఆరోపించారు.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ తప్పుకోవాలన్న అభ్యర్థనను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. కేజ్రీవాల్, ఇతరులపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని ఆయన కోర్టును కోరారు. కేజ్రీవాల్ లేవనెత్తిన ఆందోళనలు ‘అపరిపక్వ మనసు, అపరిపక్వ భయాలు’గా అభివర్ణించారు. ఈ విషయం ‘సంస్థాగత గౌరవానికి’ సంబంధించినదని తెలిపారు. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఎలాంటి ఒత్తిడికి లొంగకూడదని మెహతా వాదించారు. నిరాధారమైన ఆరోపణలపై కేసు నుంచి తప్పుకోవడం ఒక చెడు సంప్రదాయానికి దారితీస్తుందని ఆయన అన్నారు.
అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ కేసు న్యాయ సమీక్షకు నిలబడలేదని ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు పేర్కొంది. కేజ్రీవాల్, సిసోడియా, మరో 21 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ట్రయల్ కోర్టులోని కొన్ని నిర్ధారణలు ప్రాథమికంగా తప్పుగా ఉన్నాయని గమనించినట్లు జస్టిస్ స్వరణ కాంత శర్మ పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్య తీసుకోవాలన్న విచారణ కోర్టు సిఫార్సుపై కూడా ఆమె స్టే విధించారు. మార్చి 9న లిక్కర్ పాలసీ కేసు నిందితులకు నోటీసులు జారీ చేశారు.
అలాగే సీబీఐ పిటిషన్ విచారణ నుంచి తనను తప్పించాలని కోరుతూ కేజ్రీవాల్, ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఏప్రిల్ 13న రిజర్వ్ చేశారు. అంతకు ముందు ఈ కేసును బదిలీ చేయాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ తిరస్కరించారు. కేసు విచారణ నుంచి వైదొలగాలా వద్దా అన్నది సంబంధిత న్యాయమూర్తి నిర్ణయించాలని పేర్కొన్నారు.
Also Read:
girl duped by lover | ఇంట్లో చోరీకి బాలికను ప్రేరేపించిన ప్రియుడు.. ఫ్రెండ్స్తో కలిసి గ్యాంగ్రేప్