ముంబై: మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) లొల్లి ఇప్పట్లో సద్దుమనుగేలా లేదు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం శివసేన కార్యకర్తలు ముంబైలోని ఆమె ఇంటి ముందు నిరసన తెలిపారు. మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతారవణం ఏర్పడింది.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామని ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు హెచ్చరించారు. ఈ క్రమంలో శివసేన కార్యకర్తలు పెద్దఎత్తున ఆమె ఇంటికి చేరుకుని నిరసన తెలిపారు. కాగా, శివసేన కార్యకర్తలు తమ ఇంటిపై దాడిచేయడానికి ప్రయత్నిస్తున్నారని నవనీత్ రాణా ఆరోపించారు.
సీఎం సూచనమేరకు వారు దాడికి దిగారన్నారు. పోలీసులు తమను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదని చెప్పారు. మాతోశ్రీని తాము ఒక దేవాలయంలా భావిస్తున్నామని తెలిపారు. కానీ ఉద్ధవ్ ఠాక్రేనే ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని నవనీత్ కౌర్ విమర్శించారు.