నల్లగొండ: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. ప్రస్తుత రోజుల్లో వ్యాయామం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయని, దీంతో జీవన ప్రమాణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. దీనివల్ల గతకొంతకాలంగా ఎంతో మంది యువకులు గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారని వాపోయారు. అందువల్ల ప్రతి రోజు వ్యాయమం, యోగా, వాకింగ్లలో ఏదైనా ఒక్కటి తప్పకుండా చేయాలని సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా నల్లగొండలో నిర్వహించిన తెలంగాణ రన్ను (Telangana 2k run) గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తరువాత పట్టణాలు, పల్లెలు, గొప్పగా అభివృద్ధి చెందాయన్నారు. పార్కులు, క్రీడా ప్రాంగణాలు అన్నింటినీ అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానంతో నల్లగొండ పట్టణం గొప్పగా అభివృద్ధి చెందిందన్నారు. జిల్లా కేంద్రం అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులను కేటాయించారని చెప్పారు. అత్యధికంగా మెడికల్ కాలేజీలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వెల్లడించారు. ఇంత గొప్పగా రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నాయకత్వాన్ని రానున్న ఎన్నికల్లో మళ్లీ బలపర్చాలని తెలిపారు.