ప్రభుత్వ కార్యక్రమాలు, సభల సమయంలో ఒక్కో ప్లేటు భోజనానికి రూ.7 వేల వరకు ఖర్చు పెట్టే బీజేపీ సర్కారుకు బడి పిల్లలు తినే భోజనం చార్జీలను పెంచేందుకు మనసు రావడంలేదు. ‘మధ్యాహ్న భోజనం’ పథకానికయ్యే మీల్స్ చార్జీలు పెంచాలంటూ బీజేపీపాలిత గుజరాత్లో గత కొన్ని నెలలుగా ధర్నాలు చేస్తుంటే, ఎట్టకేలకు సర్కారు చార్జీలను సవరించింది. అయితే, ఒక్కో విద్యార్థికి 58 పైసలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అత్తెసరు పెంపుతో విద్యార్థులకు పౌష్టికరమైన భోజనాన్ని ఎలా అందించాలని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “మధ్యాహ్న భోజనం’ చార్జీల పెంపు ప్రభుత్వానికి ఒక జోక్లాగా కనిపిస్తున్నది. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఒక్కో ప్లేటు భోజనానికి రూ. 5,000-రూ.7,500 వరకు ఖర్చుచేస్తున్న సర్కారుకు విద్యార్థులంటే చులకనగా ఉన్నది’ అని హేమంత్ షా అనే హక్కుల కార్యకర్త మండిపడ్డారు.