చెన్నై, నవంబర్ 2: ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ అధికార డీఎంకే డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ప్రతిపక్షాల మద్దతును కూడగడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నామని, ఆమెకు అందజేసే వినతిపత్రంలో ప్రతిపక్షాలన్ని సంతకాలు చేస్తే బాగుంటుందంటూ ఓ లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన కాంగ్రెస్ సంతకం చేయడానికి అంగీకరించింది. ఇప్పటికే గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా తప్పుపడుతున్న వామపక్షాలు కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న గవర్నర్లపై పోరాడటానికి విపక్షాలు ఏకం కావాలంటూ ఇటీవల సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేసిన విషయం విదితమే.
కేరళ గవర్నర్ నోటీసుపై హైకోర్టుకు వీసీలు
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ జారీ చేసిన షోకాజ్ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఆ రాష్ర్టానికి చెందిన ఏడు యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల 9 యూనివర్సిటీల వీసీలు తమ పదవులకు రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫ్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే వీసీలు నిరాకరించడంతో పదవిలో నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన వీసీలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా నోటీసులు జారీ చేయడం అక్రమమని ప్రకటిస్తూ వాటిని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.
ఆరెస్సెస్ ఎజెండా అమలుకు గవర్నర్ యత్నం: విజయన్
కేరళలో ఆరెస్సెస్ ఎజెండాను అమలు చేయడానికి గవర్నర్ ఆరిఫ్ ప్రయత్నిస్తున్నారని సీఎం విజయన్ ఆరోపించారు. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బిల్లులపై సంతకం చేయరు. వీసీలు రాజీనామా చేయాలంటారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిని తొలగించాలంటారు.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రతి విషయంలో అడ్డుపుల్ల వేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన శాసనసభ అధికారాలను రద్దు చేయడానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారు’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.