న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమ్మిట్ (G20 Summit) కోసం కేంద్ర ప్రభుత్వం రూ.416 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను పార్లమెంట్కు గురువారం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జీ20 వ్యయాలకు సంబంధించి పలు ప్రశ్నలను లేవనెత్తారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమ్మిట్ నిర్వహణ కోసం రూ.1,310 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 11 నాటికి కేవలం రూ. 416.19 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పలు బిల్లుల ప్రాసెస్ ఇంకా జరుగుతోందని చెప్పారు.
కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 9, 10న ఢిల్లీలో ప్రపంచ నేతల సమ్మిట్తో సహా దేశవ్యాప్తంగా 60 ప్రదేశాలలో 200కు పైగా సమావేశాలకు ప్రధానంగా ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి మురళీధరన్ తెలిపారు. సమావేశాల నిర్వహణకు అత్యధికంగా సుమారు రూ.161.05 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. హోటళ్లు, సమావేశ వేదికల కోసం సుమారు రూ.118 కోట్లు, రవాణా కోసం రూ.49.02 కోట్లు, ప్రత్యేక విమానాలకు రూ.7.36 కోట్లు, విజ్ఞాన భాగస్వాముల గ్రాంట్లకు రూ.3.42 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
మరోవైపు బ్రాండింగ్, పబ్లిసిటీ కోసం రూ.32.50 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. ప్రొఫెషనల్ సర్వీసెస్ కోసం రూ.7 కోట్లు, స్థాపన ఖర్చుల కోసం రూ.2 కోట్లు, ఐటి- వెబ్సైట్- సైబర్ సెక్యూరిటీ కోసం రూ.10.31 కోట్లు, ఇతర అవసరాలకు రూ.25.52 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పలు వ్యయాలకు సంబంధించిన బిల్లులను ఇంకా ప్రాసెస్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.