న్యూఢిల్లీ : ఆన్లైన్ బెట్టింగ్ను ప్రోత్సహించే ప్రకటనలపై నిషేధం విధిస్తూ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది. వినియోగదారులకు ఇవి సామాజికార్ధిక ముప్పుగా పరిణమిస్తున్నందున ఈ తరహా ప్రకటనలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ బెట్టింగ్ వేదికలకు సంబంధించిన ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కేంద్రం కోరింది.
పలు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, ఆన్లైన్ మీడియాలో పెద్దసంఖ్యలో ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్స్, ప్లాట్ఫాంల గురించిన ప్రకటనలు వెల్లువెత్తిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ను దేశంలోని పలు ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తారని, వీటిపై ప్రకటనలు ముఖ్యంగా చిన్నారులు, యువతకు సామాజికార్ధిక ముప్పుగా పరిణమించాయని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
నిషేధిత కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఇవి వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019కి విరుద్ధమని పేర్కొంది. ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978కి విరుద్ధంగా ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ప్రజా ప్రయోజానాలను కాపాడే క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్పై తాజా మార్గదర్శకాలను జారీ చేశామని తెలిపింది.