వెల్దుర్తి, ఏప్రిల్ 16 : తెలంగాణ ప్రాంత రైతుల దశదిశను తెలంగాణ సర్కారు మార్చిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని హక్కీంపేట గ్రామ శివారులో ఉన్న హల్దీవాగు ప్రాజెక్టు గోదావరి జలాలతో నిండి, అలుగుపారడంతో శుక్రవారం ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు పూజలు చేశారు. గోదావరి జలాలకు పాలతో అభిషేకాలు చేసి, పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించారు. అలుగు నీటిలో పూలు చల్లారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మండుటెండల్లో హల్దీవాగు ప్రాజెక్టు పొంగి, అలుగు పారడం, చెక్డ్యాంలు మత్తడి దూకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గోదావరి నీళ్లు హల్దీవాగు ప్రాజెక్టులో పారడం కలలో కూడా ఊహించనిదన్నారు.
కాలం, వానలతో పని లేకుండా ఎలాంటి నదులు లేని చోట్ల రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు కట్టి, గోదావరి జలాలను మళ్లించి ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలను సస్యశ్యామం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. అద్భుతమైన పంటలు పండించే అవకాశం తెలంగాణ ప్రజలకు ఉందని, కానీ, గతంలో పొలాలు అచ్చు కట్టాలన్న, తుకాలు పోయాలన్న, దుక్కి దున్నాలన్న మబ్బులకేసి చూడాల్సి వచ్చేదన్నారు. కానీ, ఇప్పుడు వానల కోసం ఎదురుచూడకుండా రోహిణికార్తెలోనూ తుకాలు పోసి, పంటల సాగులు ప్రారంభించుకోవచ్చన్నారు. 70ఏండ్లలో సాధించని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఏడేండ్లలో చేసి చూపించారని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, నిన్న, మొన్న చేరిన చోటామోటా నాయకులు రంగురంగుల ఫొటోలు, వీడియోలతో టీవీల్లో ప్రచారాలు చేస్తూ పబ్బం గడిపితే, సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి, గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగి, ప్రజల రుణం తీర్చుకున్నారన్నారు. మంజీరాపై సీమాంధ్ర పాలకులు ఏనాడు చెక్డ్యాం కట్టకపోతే, తెలంగాణ వచ్చిన తర్వాత చెక్డ్యాంలను కట్టుకొని నీటి నిల్వలు పెంచుకున్నామన్నారు. హల్దీ, మంజీరా పరీవాహకంలో గతంలో ఒక ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదని, కానీ, నేడు గోదావరి జలాలతో హల్దీ, మంజీరా పరీవాహక ప్రాంతాలను సస్యశ్యామలం చేయనున్నారన్నారు.
గోదావరి జలాలతో మెదక్ జిల్లాలో సైతం తేమ శాతం పెరుగుతుందని, దీంతో ఆయిల్ పాం సాగుకు మెదక్ జిల్లా అనుకూలంగా మారుతుందన్నారు. మన రాష్ట్రంలో ఆయిల్ పాం పండించే ప్రాంతాల్లో మెదక్ జిల్లాను చేర్చుతామని మంత్రి హరీశ్రావు అన్నారు. అలాగే వ్యవసాయ మంత్రితో మాట్లాడి ఆయిల్పాం సాగు చేసే మెదక్ జిల్లా రైతులకు లాగోడి, రుణాలు, రాయితీలో, డ్రిప్ను అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ ఏసయ్య, ఈఈ శ్రీనివాసరావు, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ చంద్రాగౌడ్, జిల్లా కో ఆప్షన్ మన్సూర్, జడ్పీటీసీ రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్రెడ్డి, మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్రెడ్డి, ఎంపీటీసీలు నవనీత, సోని, నాయకులు స్టేషన్శ్రీను, నరెందర్రెడ్డి, సిద్ధిరాములు గౌడ్, ప్రతాప్రెడ్డి, సంపత్రావు, శ్రీనునాయక్తో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.