పాట్నా: ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు. బీహార్ రాష్ట్ర పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సుమారు రూ. 14,000 కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను సీఎం నితీశ్ కుమార్ ఆవిష్కరించారు. ఆయన పార్టీ జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన విద్యుత్ మంత్రి బిజేంద్ర యాదవ్, కీలకమైన రెవెన్యూ, భూ సంస్కరణల శాఖ కలిగిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అగ్రనేత అలోక్ మెహతా తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడారు. మహా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న పార్టీలు తమ ప్రతిష్టను పెంచుకోవడానికి ప్రభుత్వం సాధించిన విజయాలను ఉపయోగించుకోవడాన్ని ఆయన ఖండించారు. ‘నా మంత్రులలో చాలామంది ప్రభుత్వం చేసిన మంచి పనికి వారి పార్టీలకు క్రెడిట్ ఇవ్వడం నేను గమనించాను. ఇది సరికాదు’ అని పరోక్షంగా ఆర్జేడీ మంత్రులను విమర్శించారు. అయితే తన పార్టీకి చెందిన విద్యుత్ మంత్రి బిజేంద్ర యాదవ్ను ప్రశంసలతో ముంచెత్తారు. తాను అధికారంలో ఉన్నంత వరకు ఆయన కూడా పదవిలో ఉంటారని అన్నారు. ఆయన నిరాకరిస్తే తాను కూడా అంతా వదిలేస్తానని వ్యాఖ్యానించారు.