న్యూఢిల్లీ, మార్చి 13: దేశ పౌరులు బంగారం, వెండే కాదు.. గ్యాస్ సిలిండర్లు కూడా భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడేలా ఉంది. తీవ్ర కొరతతో బ్లాక్మార్కెట్లో గ్యాస్ ధర భగ్గుమంటుండటంతో ఇప్పుడు దేశంలో గ్యాస్ సిలిండర్ల చోరీలు కూడా ప్రారంభమయ్యాయి. దొంగలు ఇండ్లు, హోటళ్లపై దాడిచేసి సిలిండర్లను ఎత్తుకుపోతున్నారు. కేరళ, కర్ణాటకలో గ్యాస్ సిలిండర్లు చోరీ అయినట్టు కేసులు నమోదయ్యాయి. కేరళలోని తిరువనంతపురంలోని వీఎస్ హోటల్లో అర్ధరాత్రి రెండు గంటలకు గ్యాస్ సిలిండర్ చోరీ అయ్యింది. గుర్తు తెలియని ఒక వ్యక్తి హోటల్ ప్రాంగణంలోకి ప్రవేశించి సీసీటీవీలు పనిచేయకుండా మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
తర్వాత గ్యాస్తో నిండి ఉన్న సిలిండర్ను దర్జాగా భుజాన వేసుకుని వెళ్లిపోయాడు. అయితే ఇన్వర్టర్ ద్వారా పనిచేసే సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బెంగళూరు దక్షిణ జిల్లా రామనగర్లోని చన్నపట్నలో కృష్ణప్ప అనే వ్యక్తి మార్చి 7న కుటుంబంతో బయటకు వెళ్లారు. ఇంట్లోని అదనపు గ్యాస్ సిలిండర్ను ఇంటి కాంపౌండ్లో ఉంచారు. బయటకెళ్లి వచ్చిన కృష్ణప్ప గ్యాస్ సిలిండర్ చోరీ అయిన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వద్ద సీసీటీవీని పరిశీలించగా, స్కూటర్పై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ఆవరణలో ఉన్న సిలిండర్ను పట్టుకుని వెళ్లడం కన్పించింది.