న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవ నది.. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.. పాపాలు పోవటమేమోకానీ.. ఇప్పుడు ఆ నదిలో మునిగితే లేనిపోని రోగాలన్నీ అంటుకొనే దుస్థితి దాపురించింది. 37 ఏండ్లుగా గంగానదిని శుద్ధిచేస్తున్నా ఇప్పటికీ అది మురుగు కాలువలాగే ఉన్నదని సాక్షాత్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆందోళన వ్యక్తంచేసింది.
కాలుష్యం నుంచి నదిని కాపాడేందుకు ప్రారంభించిన గంగా యాక్షన్ ప్లాన్ (జీఏపీ), నమామీ గంగే వంటి కార్యక్రమాలేవీ విజయవంతం కాలేదు. ఏటా వందలకోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తంచేసింది. నదిని పరిరక్షించేందుకు కచ్చితమైన ప్రణాళిక, కఠిన నిబంధనలు రూపొందించాలని నేషనల్ గంగా కౌన్సిల్ (ఎన్జీసీ)ని ఆదేశించింది.
గంగా శుద్ధి ఎన్జీసీ సభ్య కార్యదర్శికి ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదేశ్కుమార్ గోయల్ కీలక సూచనలు చేశారు. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ సమీక్షించి, కచ్చితమై.. కఠిన నిబంధనలతో అక్టోబర్ 14 నాటికి యాక్షన్ ప్లాన్ను రూపొందించాలని ఆదేశించారు.
‘గంగా శుద్ధికి నిర్దేశించిన లక్ష్యాలేవీ నెరవేరకపోవటానికి ఎవరూ బాధ్యత వహించటంలేదు. ఒక విభాగం మరో విభాగంపై నిందలేసుకోవటం తప్ప ఏమీ ఫలితం ఉండటంలేదు. గంగా కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తున్నవారి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. లేదంటే ఎంతకాలమైనా పరిస్థితి ఇలాగే ఉంటుంది’ అని ఎన్జీటీ వ్యాఖ్యానించింది.
మన దేశ జనాభాలో దాదాపు 40 కోట్లమంది ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో గంగానదిపై ఆధారపడి జీవిస్తున్నారు. భూగోళంపై ఉన్న హిందువులందరూ ఈ నదిని పవిత్రంగా భావిస్తారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు గంగానది పరీవాహక ప్రాంతం కేంద్రంగా ఉన్నది.
వ్యవసాయ, మానవ వ్యర్థాలతోపాటు పారిశ్రామిక వ్యర్థాలను కూడా నదిలోకి నేరుగా వదులుతుండటంతో తీవ్రంగా కలుషితం అవుతున్నది. ప్రస్తుతం నదిలో 50 శాతం నీరు మురుగేనని ఎన్జీటీ వ్యాఖ్యానించటం నది దుస్థితికి అద్దం పడుతున్నది.
నది వేగంగా కలుషితమవుతున్నదని కేంద్రప్రభుత్వం దాదాపు 4 దశాబ్దాల కిందే గుర్తించి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1986 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ (జీఏపీ) ప్రారంభించారు. జీఏపీ కింద 2016 జూన్ నాటికి కేంద్రం గంగా పరిరక్షణకు రూ. 6,788.78 కోట్లు మంజూరు చేసింది. అందులో రూ.4,800 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్రమే తెలిపింది.
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గంగా పరిరక్షణకు అదే ఏడాది జూన్లో నమామీ గంగా అనే కొత్త యాక్షన్ ప్లాన్ను ప్రారంభించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు (2021 జూన్ 30 వరకు) ఈ పథకం కింద మోదీ సర్కారు రూ.15,074.88 కోట్లు మంజూరు చేసి, రూ.10,792.02 కోట్లు విడుదల చేసింది.
ఈ నిధులన్నీ ఏమయ్యాయో తెలియదు కానీ.. గంగ మాత్రం ఇంకా మురుగు గంగగానే మిగిలిపోయింది. గంగానది పరివాహక రాష్ర్టాలైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్కు ఈ నిధుల వరద పారింది. కానీ, ఫలితం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగానే ఉన్నదని సాక్షాత్తూ ఎన్జీటీయే పేర్కొనటం గమనార్హం.