Ganesh mandal : యావత్ భారత దేశం గణపతి నవరాత్రి ఉత్సవాలకు (Ganesh Navratri Celebrations) కు సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం అంతటా మండపాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా ఖరీదైన గణేశుడి విగ్రహాలు (Ganesh idols), భారీ సెట్టింగ్లతో ఏర్పాటయ్యే తాత్కాలిక మండపాలు ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఏదైనా జరిగితే భారీగా నష్టపోకుండా కొన్ని మండపాలకు ఇన్సూరెన్స్ చేస్తారు.
ఈ నేపథ్యంలోనే ముంబైలోని ఓ గణేశుడి మండపానికి కూడా ఏకంగా రూ.474.46 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ముంబై శివారులోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్.. వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది. ఈసారి 71వ వార్షికోత్సవం జరగనుంది.
దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా రూ.474.46 కోట్లతో బీమా చేయించారు. ఇక్కడి విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించనుండటమే అందుకు కారణం. గత ఏడాది సైతం ఈ గణేశ్ మండపానికి రూ.400.58 కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు బంగారం, వెండి ధరలు పెరగడంతో బీమా విలువను కూడా పెంచారు.
అందులో పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బందికి రూ.375 కోట్లతో వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకున్నారు. గణపయ్యకు అలంకరించే బంగారం, వెండి ఆభరణాలకు రూ.67 కోట్లతో బీమా చేయించారు. 2023, 2024 సంవత్సరాల్లో గణపయ్య ఆభరణాలకు వరుసగా రూ.38 కోట్లు, రూ.43 కోట్లు బీమా కవరేజ్ తీసుకున్నారు.
అంతేగాక అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో రూ.2 కోట్ల బీమా చేయించారు. అక్కడి ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద రూ.30 కోట్లు కేటాయించారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను కూడా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు.