Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మరో రెండు వారాల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నది. అవినీతి, అసమర్థ, కమీషన్ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న కుమ్ములాటలు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఇటీవల పలువురు సీనియర్లు గుడ్బై చెప్పడంతో నైరాశ్యం ఆవహించింది. ఇటువంటి సమయంలో బీజేపీని మరో కీలక అంశం కలవరపరుస్తున్నది. అదే.. కేఆర్పీపీ, ఆప్ పార్టీల ప్రభావం. బీజేపీ మాజీ నేత గాలి జనార్ధన్రెడ్డి స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ)తోపాటు అన్ని రాష్ర్టాల్లో తన ఉనికి చాటాలని ప్రయత్నాలు చేస్తున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభావం ఎలా ఉంటుందో? తమ ఓటు బ్యాంకుకు గండి కొడతాయేమో? అని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
పలు జిల్లాల్లో కేఆర్పీపీ ప్రభావం
తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న కేఆర్పీపీ 49 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కేఆర్పీపీ ప్రభావం గాలి జనార్ధన్రెడ్డి సొంత జిల్లా బళ్లారితో పాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బళ్లారి, రాయచూరు, కొప్పళ, చిత్రదుర్గ, విజయనగర జిల్లాల్లో గతంలో బీజేపీకి మద్దతుగా ఉన్న జనార్ధన్రెడ్డి అనుచరులతో పాటు కార్యకర్తలు చాలా మంది ఈసారి కేఆర్పీపీ వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. ఈ పార్టీ నుంచి నిలబడే అభ్యర్థులకు ప్రధానంగా బీజేపీ ఓట్లే బదిలీ అవుతాయనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు పట్టణ, నగర ప్రాంతాల్లో ఆప్ ప్రభావం కొంతమేర కనిపిస్తున్నది. ఆప్తో బెంగళూరుతో పాటు హుబ్బళ్లి, ధార్వాడ, మైసూరు, బెళగావి తదితర నగర ప్రాంతాల్లో బీజేపీ ఓట్లకు గండి పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదని బీజేపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఆప్ ఇప్పటికే ఢిల్లీతో పాటు పంజాబ్లో అధికారంలో ఉన్నది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 12 శాతం ఓటు షేర్తో ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని ప్రభావం చూపింది.
పాత మైసూర్లో బీజేపీ ఆపసోపాలు
పాత మైసూర్ రీజియన్లో పాగా వేసేందుకు అధికార బీజేపీ ఆపసోపాలు పడుతున్నది. కాంగ్రెస్, జేడీఎస్కు కంచుకోట అయిన ఈ రీజియన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి కమలం పార్టీ పడరానిపాట్లు పడుతున్నది. కాంగ్రెస్, జేడీఎస్ నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు వేసిన పాచికలు పారకపోవడంతో తిరిగి అధికారం దక్కదని గాబరా పడుతున్నది. కర్ణాటక రాజకీయాలను నిర్ణయించే ఈ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల్లో వొక్కలిగల ఓట్లు 12-15 శాతం ఉంటాయి.
ఈ ప్రాంత ఓటర్లు సంప్రదాయబద్ధంగా కాంగ్రెస్, జేడీఎస్కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లు ఉన్న పాత మైసూర్ రీజియన్లో జేడీఎస్ 25 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు, బీజేపీ ఐదు, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలుపొందారు. 2019లో కాంగ్రెస్, జేడీఎస్ నుంచి కొందరు నేతలను బీజేపీ దిగుమతి చేసుకున్నది. గతంలో సింగిల్ డిజిట్కు పరిమితమైన కమలం పార్టీ దిగుమతి నేతలతో అధిక సీట్లు గెలుచుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. బీజేపీ, హిందుత్వ శక్తులు చరిత్రను వక్రీకరించడంతోపాటు రిజర్వేషన్ను తొలగించాయని అధికార పార్టీపై ముస్లింలు గుర్రుగా ఉన్నారు.