బడంగ్పేట, ఏప్రిల్ 17 : మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్వన్గా తీర్చిదిద్దుతామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం గుర్రంగూడలో రూ.52లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. జిల్లాలోనే మహేశ్వరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీపడేదిలేదని చెప్పారు. అవసరం ఉన్న ప్రతి కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్, కో-ఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్స్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.