న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI). అయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పావుగా మారిపోయిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్లకు ప్రత్యర్థులను వేటాడేందుకు ఇదో ఆయుధం అన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే దీనిపై తాజాగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికైనా ఈ పంజరంలో చిలుక (సీబీఐ)ని స్వేచ్ఛగా వదిలేయాన్న ప్రయత్నమే ఈ తమ ఆదేశాలు అని హైకోర్టు అనడం గమనార్హం. సీబీఐ కచ్చితంగా ఓ స్వతంత్ర సంస్థలా పని చేయాలని, అది కేవలం పార్లమెంట్కు మాత్రమే రిపోర్ట్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కేవలం పార్లమెంట్కే జవాబుదారీగా ఉండే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)లాగే సీబీఐకి కూడా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉండాలని కోర్టు చెప్పింది.
పంజరంలో చిలుక సీబీఐ
నిజానికి సీబీఐని పంజరంలో చిలుకగా 2013లో తొలిసారి సుప్రీంకోర్టు అభివర్ణించింది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బొగ్గు గనుల విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ.. కాంగ్రెస్ చేతుల్లో సీబీఐ పావుగా మారిందన్న ఆరోపణలు చేసింది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు మరోసారి సీబీఐకి స్వయం ప్రతిపత్తి అంశంపై స్పందిస్తూ.. అది కేవలం చట్టబద్ధమైన హోదాతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా సీబీఐకి మరిన్ని అధికారాలు, అధికార పరిధి వచ్చేలా.. ప్రత్యేకమైన చట్టంతో ఆ సంస్థకు చట్టబద్ధమైన హోదా ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వ నియంత్రణ లేకుండా సీబీఐ స్వేచ్ఛగా పనిచేసేలా చూడాలనీ స్పష్టంచేసింది.
తమిళనాడులో జరిగిన 300 కోట్ల పోంజీ స్కామ్పై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ కిరుబకరన్, జస్టిస్ పుగలేందిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. ఎన్నికల సంఘం, కాగ్లాగా సీబీఐని కూడా స్వతంత్రంగా పని చేసేలా చేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. 1941లో ఏర్పాటైన సీబీఐ ప్రధానమంత్రి కార్యలయం నియంత్రణలో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కు రిపోర్ట్ చేస్తుంది. ఈ సీబీఐ డైరెక్టర్ను ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నేతలతో కూడిన ముగ్గుర సభ్యుల కమిటీ నియమిస్తుంది.