Uttarakhand | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరకాశీలో భారీ వర్షం కారణంగా కొండలపై నుంచి బండరాళ్లు (Boulders) రోడ్డుపై పడటంతో మూడు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సుమారు 30 మంది యాత్రికులు సోమవారం సాయంత్రం సమయంలో ఉత్తరాఖండ్ లోని గంగోత్రి (Gangotri) వద్ద యాత్ర ముగించుకుని మూడు వాహనాల్లో మధ్యప్రదేశ్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనాలు కొండ పక్కనే ఉన్న రోడ్డుపై వెళుతుండగా బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి వాహనాలపై పడ్డాయి. ఈ ఘటనలో మహిళ సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందినవారని తెలిసింది.
కాగా, రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ లోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కుండపోతగా వర్షం పడుతోంది. వర్షం సంబంధిత సంఘటనల్లో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు రూ.3,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read..
Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్లో ఆగని లేఆఫ్స్.. ఈ సారి భారీగా తొలగింపులు
Himachal Pradesh | హిమాచల్ లో వరుణుడి బీభత్సం.. 30 మంది మృతి.. రూ.3వేల కోట్ల మేర నష్టం..!